నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. డిసెంబర్ 30వ తేదీన నిర్వహించే వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లులో ఎక్కడా లోపం లేకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 3.30 గంటల నుంచే వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు కల్పించేలా పనులు పూర్తి చేయాలని ఇప్పటికే ఆలయ కమిటీ సభ్యులు చెవిరెడ్డి మోహిత్రెడ్డి సూచించడంతో అందుకు తగ్గట్టుగా పనులు పూర్తి చేస్తున్నారు. ప్రతి ఏటా నిర్వహించే వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లకు అనుగుణంగా రంగు రంగుల చలువ పందిర్లు, భక్తులను ఆకర్షించేలా సెట్టింగ్లతో పాటు విద్యుత్తు కటౌట్లు, పువ్వుల అలంకరణకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయం ముందు సర్వదర్శనానికి ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ట బ్యారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ శివార్లలో పార్కింగ్ స్థలాలను గుర్తించి క్లీనింగ్ పనులు చేపట్టారు. అదేవిధంగా గ్రామంలోకి వచ్చే దారుల్లో ఆర్చిల ఏర్పాటుకు కర్రలు కట్టి ప్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దశవతారాల విద్యుత్తు కటౌట్ల ఏర్పాటు పనులు ప్రారంభం కావడంతో రెండు రోజుల్లో అన్ని రకాల పనులు పూర్తి చేయనున్నారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మీ పనులను పర్యవేక్షిస్తున్నారు.




