నేటి సాక్షి ,చేర్యాల:భక్తుల కొంగు బంగారమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం ఆదివారం కనుల పండువగా జరిగింది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ముగిసింది. సుమారు 10 వేల మంది భక్తులు పాల్గొనడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. ఏటా మార్గశిరమాసం చివరి ఆదివారం ఈ కల్యాణం నిర్వహిస్తారు. ఉదయం 10.45 గంటలకు మల్లికార్జునుడు బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను వివాహమాడారు. బర్దీపూర్ వీరశైవ ఆగమ సంప్రదాయ పీఠాధిపతులు మహంత్ సిద్దేశ్వరానందగిరి స్వామీజీ వేద పర్యవేక్షణలో క్రతువు జరిపించారు. ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్య కార్యదర్శి | శైలజా రామయ్యర్, దేవాదాయశాఖ కమిషనర్ హరీశ్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఉత్సవ కమిటీ సభ్యులు కల్యాణోత్సవ ప్రత్యేకాధికారి రామకృష్ణారావు, ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్, ప్రధానార్చకుడు మహదేవుని మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.





