నేటి సాక్షి, ఎండపల్లి:* మండలం లోని గుల్లకోట రైతు వేదికలో అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో రైతులకు సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అధిక రసాయన ఎరువుల వాడకం వల్ల భూమి సారవంతత తగ్గిపోవడం, దిగుబడులపై ప్రభావం పడటం వంటి సమస్యలపై ఉమ్మడి మండల వ్యవసాయ శాఖాధికారులు కమల్ల మహేష్, సాయి కిరణ్ లు రైతులకు వివరించారు. యూరియా వంటి ఎరువులను అవసరానికి మించి వాడటం వల్ల నేలలోని సూక్ష్మజీవులు నశించి భూమి ఆరోగ్యం దెబ్బతింటుందని, రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరించి మితంగా ఎరువులు వాడాలని సూచించారు. నానో యూరియా వినియోగం వల్ల తక్కువ పరిమాణంలోనే పంటలకు అవసరమైన నత్రజని అందుతుందని, ఖర్చు తగ్గడంతో పాటు పంటల వృద్ధి మెరుగుపడుతుందని వివరించారు. ఆకులపై పిచికారీ చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను వివరించి, గోమయం, జీవామృతం వంటి సహజ వనరులతో సాగు చేస్తే నేల సారవంతత పెరిగి, దీర్ఘకాలంలో రైతులకు లాభదాయకమవుతుందని ఏవోలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు లావణ్య, సందీప్, ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

