నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చిత్తూరు, డిసెంబరు 6: అపోలో యూనివర్సిటీలో శనివారం నిర్వహించిన “ది అపోలో గ్లోబల్ డిప్లొమసీ మీట్–2025” ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి సమావేశాలను తలపించే వాతావరణంలో జరిగిన దౌత్య సదస్సులో విద్యార్థులు వివిధ దేశాల ప్రతినిధులుగా వ్యవహరిస్తూ అత్యున్నత స్థాయి దౌత్య ప్రతిభను ప్రదర్శించారు. వారి ఉపన్యాసాలు, వాదోపవాదాలు, డిప్లొమాటిక్ స్పందనలు హాజరైన వారిని మెప్పించాయి. ప్రపంచ శాంతి, మైనారిటీ హక్కులు, సూడాన్లోని ప్రస్తుత సంక్షోభం వంటి అంశాలపై విద్యార్థులు చేసిన లోతైన అధ్యయనం, గణాంకపరమైన విశ్లేషణ, సమతుల్య అభిప్రాయాలు అసలు యుఎన్ కమిటీ చర్చలను గుర్తు చేశాయి. హ్యూమన్ రైట్స్ డేను పురస్కరించుకుని అపోలో మోడల్ యునైటెడ్ నేషన్స్ క్లబ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిజిస్ట్రార్ ప్రొ. ఎం. పోతరాజు విద్యార్థుల గ్లోబల్ అవగాహన, దౌత్య నైపుణ్యాలను ప్రశంసించారు. అపోలోలో క్లబ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రధాన ఉద్దేశ్యం కూడా ఇదేనని, విద్యార్థులలో ప్రపంచ దృక్పథం పెంచడం, వారి ప్రతిభకు అనువైన వేదిక కల్పించడం అని పేర్కొన్నారు.యూనివర్సిటీలో ప్రస్తుతం 28 క్లబ్లు విద్యార్థులే ముందుండి చురుకుగా నడుపుతున్న విషయాన్ని రిజిస్ట్రార్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. “అకడమిక్ జ్ఞానంతో పాటు… డిప్లొమసీ, లీడర్షిప్, టీమ్వర్క్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రొఫెషనల్ నైపుణ్యాలు–ఇవన్నీ విద్యార్థులు అలవర్చుకోవడానికి క్లబ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతి విద్యార్థి కనీసం ఒక క్లబ్లో చురుకుగా పాల్గొంటే భవిష్యత్తులో వారు ఏ వేదికలోనైనా ధైర్యంగా నిలబడగలరు” అని పిలుపునిచ్చారు.క్లబ్ల ఏర్పాటులో మొదట ఇతర విశ్వవిద్యాలయాలతో కలిసి కార్యక్రమాలు ప్రారంభించామని, భావాల మార్పిడికి అది అద్భుతమైన వేదికగా నిలిచిందని చెప్పారు. అనంతరం అపోలో విద్యార్థులే పూర్తి స్థాయి క్లబ్ వ్యవస్థను బలోపేతం చేసి, యూనివర్సిటీ క్యాంపస్లో సృజనాత్మకత, వైవిధ్యభరిత ఆలోచనలకు కొత్త ఊపును తీసుకువచ్చారని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీన్లు ప్రొ. డి. జగదీశన్, డాక్టర్ రామయ్య ఇటుమల్ల, అపోలో మోడల్ యునైటెడ్ నేషన్స్ క్లబ్ ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్ డాక్టర్ సుధా పైపూరు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు ఉత్సాహంగా చర్చల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్లోబల్ ఇష్యూలపై అవగాహన, దౌత్యపరమైన ఆలోచన, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో ఈ వేదిక కీలకమైన అడుగుగా నిలిచింది.





