నేటి సాక్షి గజ్వేల్ :—ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గజ్వేల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని తన ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ — గజ్వేల్ నియోజకవర్గంలో ప్రారంభించిన అనేక అభివృద్ధి పనులు మధ్యలోనే ఆగిపోయాయని తెలిపారు. రహదారులు, డ్రైనేజీలు, మౌలిక వసతుల నిర్మాణాలు పూర్తి కాక ప్రజలు తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారని అన్నారు.మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాలనలో గజ్వేల్ నియోజకవర్గం వేల కోట్ల రూపాయల అభివృద్ధిని చూసిందని గుర్తుచేశారు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల విస్తరణ, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి వంటి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించామని చెప్పారు.కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, కొత్త పనులు చేపట్టడమే కాకుండా ఇప్పటికే ప్రారంభించిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు.గజ్వేల్ ప్రజలపై రాజకీయ వైరం చూపుతూ అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని ఆయన అన్నారు. అసంపూర్తిగా ఉన్న అన్ని నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేకపోతే ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తూ — గజ్వేల్ అభివృద్ధిని ఆపే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు.





