నేటి సాక్షి గజ్వేల్….నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలో మల్లన్న స్వామి జాతర సందర్భంగా చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కుల వివక్షతో ఆలయానికి వెళ్లిన కుటుంబాన్ని అడ్డుకొని దాడి చేయగా, ఆ హింసలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ ఘటనపై వెంటనే కేసులు నమోదు చేసి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి డిమాండ్ చేశారు. సోమవారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణులు, జిల్లా నాయకులు కొల్గూరి మైసయ్యతో కలిసి ఆయన మాట్లాడారు.జాతర సందర్భంగా వెనుకబడిన వర్గానికి చెందిన చాకలి చంద్రకళ కుటుంబం దర్శనం కోసం ఆలయానికి వెళ్లగా, ప్రవేశ ద్వారం వద్ద వారిని అడ్డుకొని కుల దూషణలు చేస్తూ దాడి చేసినట్లు తెలిపారు. ఈ ఘర్షణలో పసికందు తీవ్రంగా గాయపడి అనంతరం మరణించిందని పేర్కొన్నారు. ఈ ఘటన సమాజానికి మచ్చగా నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇది కేవలం ఒక క్రిమినల్ ఘటన మాత్రమే కాదని, భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానత్వం, గౌరవం, ఆరాధనా స్వేచ్ఛ, మానవ హక్కులపై జరిగిన దాడిగా అభివర్ణించారు. నిందితులపై తక్షణమే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డీబీఎఫ్ నాయకులు కోరారు.





