నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణంలోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక వైద్య ఖర్చులు, అనవసర మెడికల్ పరీక్షలు, పూర్తి ఎం.ఆర్.పీ ధరలకు మందుల విక్రయం జరుగుతోందనే ఆరోపణల నేపథ్యంలో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ విషయంపై సమాజ్వాది పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముజాహిద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.*సేవా ధోరణి తగ్గిపోతోంది.!*కోరుట్లలో ఆరోగ్య రంగం సేవా మార్గం నుంచి వ్యాపార మార్గానికి మళ్లుతోందనే అనుమానాలు ప్రజల్లో పెరుగుతున్నాయని ముజాహిద్ పేర్కొన్నారు. చిన్నచిన్న చికిత్సలకే అధిక బిల్లులు వేయడం, అవసరానికి మించిన టెస్టులు సూచించడం వంటి అంశాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. వైద్య సేవలు ప్రజలకు భరోసా కలిగించాల్సిన సమయంలో వ్యాపార ధోరణి పెరగడం సరికాదన్నారు.*టెస్టుల రేట్లలో వ్యత్యాసాలు*ఒకే రక్తపరీక్ష లేదా స్కానింగ్ టెస్ట్కు వేర్వేరు ఆసుపత్రుల్లో వేర్వేరు ధరలు వసూలు చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఫార్మా కంపెనీలు ఇచ్చే ట్రేడ్ డిస్కౌంట్లు రోగులకు అందకుండా పూర్తి ఎం.ఆర్.పీ ధరలకే మందులు విక్రయించడం పారదర్శకత లోపమని విమర్శించారు. రేట్ల విషయంలో స్పష్టమైన ప్రమాణాలు ఉండాలని డిమాండ్ చేశారు.*పారదర్శకతకు చర్యలు అవసరం*ప్రతి టెస్ట్ వెనుక వైద్య కారణాన్ని రాతపూర్వకంగా ఇవ్వడం, ట్రీట్మెంట్ మరియు టెస్టుల రేట్లను ఆసుపత్రుల వద్ద బహిరంగంగా ప్రదర్శించడం అవసరమన్నారు. రోగులకు బయట మెడికల్ షాపుల నుంచి మందులు కొనుగోలు చేసే పూర్తి స్వేచ్ఛ కల్పించాలన్నారు. హాస్పిటల్ ఫార్మసీల యాజమాన్య వివరాలు కూడా పారదర్శకంగా ప్రకటించాలని సూచించారు.*జిల్లా అధికారుల జోక్యం కోరుతూ..*అన్ని ల్యాబ్ టెస్టులకు ప్రామాణిక కనీస–గరిష్ట రేట్లు నిర్ణయించి, ప్రతి ల్యాబ్ తమ రేట్ల జాబితాను బహిరంగంగా ప్రదర్శించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా ఆరోగ్య శాఖ ప్రత్యేక రేట్ ఆడిట్ నిర్వహించి, ఆసుపత్రులపై తనిఖీలు చేపట్టాలని కోరారు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్–2019 మరియు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నిబంధనల ప్రకారం పారదర్శకత తప్పనిసరి అని గుర్తు చేశారు.*స్పందించకపోతే ప్రజా ఉద్యమం*’ఆరోగ్యం సేవ-లాభాల దోపిడీ’కి వేదిక కాదు. జిల్లా అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో ప్రజలతో కలిసి ప్రజా ఉద్యమం చేపడతాం” అని మొహమ్మద్ ముజాహిద్ హెచ్చరించారు.______





