నేటి సాక్షి,నారాయణపేట, ఫిబ్రవరి, 25, (రిపోర్టర్ ఇమామ్ సాబ్), బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎర్రగుట్ట వద్ద గల సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను డీఎస్పీ నల్లపు లింగయ్య తనిఖీ చేసి పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి పోలీసు అధికారులు సిబ్బందికి భద్రత పరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును, భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసెందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశామని మరియు 163 (144) సెక్షన్ అమల్లో ఉన్నందున అనవసర గుంపులు ఏర్పడకుండా చూడాలని, సెల్ఫోన్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించవద్దని ఆదేశించారు. విద్యార్థులకు తాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులను డీఎస్పీ ఆదేశించారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని ఆయన తెలిపారు.ప్రశ్నపత్రాల రవాణా సమయంలోనూ, పరీక్షలు ముగిసిన అనంతరం జవాబు పత్రాలను పూర్తిస్థాయి పోలీస్ బందోబస్తుతో సురక్షితంగా పోస్ట్ ఆఫీస్ కు తరలించాలని ఆయన సూచించారు. డిఎస్పి తో పాటు ఎస్ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.





