నేటి సాక్షి – కథలాపూర్*( రాధారపు నర్సయ్య )సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పపల్లి గ్రామంలో భూములు సేకరణ ప్రారంభం కావడంతో, తమ జీవనాధారం కోల్పోయే పరిస్థితుల్లో ఉన్న చిన్న, సన్నకారు రైతులు ఎకరాకు 50 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.*భూ కోల్పోతున్న రైతుల బాధ.!*సూరమ్మ ప్రాజెక్టు కింద ఇప్పపల్లి గ్రామం నుంచి విస్తృత భూములు సేకరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో తమ కుటుంబాలు పూర్తిగా వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నామని, భూములు కోల్పోతే బతుకుదెరువు దెబ్బతింటుందని రైతులు వేదన వ్యక్తం చేస్తున్నారు. ‘రెక్క ఆడనిది… డొక్కా ఆడదు.. మా పొలాలే మా ప్రాణం..అవి పోతే మా పిల్లల భవిష్యత్తు చీకట్లోకి నెట్టబడుతుంది.. అంటూ పలువురు రైతులు ఆవేదనతో చెప్పారు. గ్రామంలో భూములు పోతున్న వారిలో దాదాపు అందరూ చిన్న, సన్నకారు రైతులే కావడం పరిస్థితికి మరింత తీవ్రతను తెచ్చిపెట్టింది.*సాధారణ భూమి ధరలు మాకు నష్టం భర్తీ చేయవు*ప్రభుత్వం నిర్ణయించే సాధారణ భూమి ధరలు తమ నష్టాన్ని తీర్చలేవని రైతులు స్పష్టం చేస్తున్నారు. దశాబ్దాలుగా సాగు చేస్తూ వచ్చి ఇప్పుడు ఆకస్మికంగా భూములు కోల్పోవడం తమకు తీవ్ర వెన్నుతోలు అవుతుందని వారు తెలిపారు. ‘భూమి ఒకసారి పోయిందంటే తిరిగి సంపాదించడం సాధ్యం కాదు. మా కుటుంబాలను నిలబెట్టే మార్గం ఉండాలంటే ఎకరాకు కనీసం 50 లక్షల రూపాయలు ఇవ్వాలి. అప్పుడే కొంత భరోసా కలుగుతుంద’ని రైతులు చెబుతున్నారు. సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణం అవసరమన్న భావన ఉన్నప్పటికీ, రైతుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సరైన పరిహారం ఇవ్వాలని వారు కోరుతున్నారు.*గ్రామ రైతుల ఏకగ్రీవ వినతి*భూముల సేకరణపై గ్రామంలో రైతులంతా ఒకే తీర్మానానికి వచ్చారు. ఎకరాకు 50 లక్షల పరిహారంపై రాజీ లేదు అని స్పష్టం చేశారు. రైతుల తరఫున మాట్లాడిన యాగండ్ల రమేష్ గౌడ్, ‘ప్రాజెక్టు అభివృద్ధి కోసం కావచ్చు… కానీ మేము రైతుల భవిష్యత్తు కూడా అంతే ముఖ్యమని ప్రభుత్వం గుర్తించాలి. మా గ్రామ రైతన్నలందరం కలిసి ఎకరాకు 50 లక్షలు ఇస్తేనే భూముల ఇవ్వడానికి సిద్ధమంటున్నాం. ఇది మా సమగ్ర వినత’ని తెలిపారు. రైతులు తమ కుటుంబాలు, పంటలు మరియు భవిష్యత్తు కోసం ఈ డిమాండ్ న్యాయసమ్మతమైందని ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.—–





