నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చిత్తూరు, అక్టోబర్ 31ః వైద్య విద్యలో బోధన ప్రమాణాలను మరింత మెరుగుపర్చే దిశగా ది అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ఏఐఎంఎస్ఆర్) మరో ముందడుగు వేసింది. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో భాగంగా “బ్లూ ప్రింటింగ్ ఇన్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఎడ్యుకేషన్” పేరిట ప్రత్యేక వర్క్షాప్ను శుక్రవారం డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి నాలెడ్జ్ సెంటర్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐఎంఎస్ఆర్ డీన్ డాక్టర్ అల్ఫ్రెడ్ జె. అగస్టిన్ హాజరై వర్క్ షాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ – “ప్రతి విద్యాసంస్థ ఎదుగుదల అధ్యాపకుల నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాలు బోధనలో సృజనాత్మకతను, అభ్యాసంలో నాణ్యతను పెంచుతాయి. నిరంతర శిక్షణా అనుభవం ద్వారా అధ్యాపకులు కొత్త బోధనా పద్ధతులను అవలంబించి, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించగలరు” అని పేర్కొన్నారు.రిసోర్స్ ఫ్యాకల్టీ డాక్టర్ సచిదానంద అదిగ మాట్లాడుతూ – “బ్లూ ప్రింటింగ్ అనేది బోధన, మూల్యాంకన మధ్య సమతౌల్యాన్ని నెలకొల్పే శాస్త్రీయ విధానం. ఇది బోధనలో స్పష్టతను, విద్యార్థుల అభ్యాసంలో నాణ్యతను పెంచుతుంది” అని తెలిపారు. ఈ విధానం మెడికల్ ఎడ్యుకేషన్లో నాణ్యతా ప్రమాణాలను మరింత పెంపొందిస్తుందని వివరించారు. ఈ వర్క్షాప్లో అసోసియేట్ డీన్స్ డాక్టర్ రమ్యా రామకృష్ణన్, డాక్టర్ ఉషా అదిగ, మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్, కరికులం కమిటీ సభ్యులు , వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.





