నేటి సాక్షి గజ్వేల్ :—తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను పణంగా పెట్టిన ఉద్యమకారుల కుటుంబాలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిపల్లిలో ఆత్మహత్య చేసుకున్న ఉద్యమకారుడు మల్లేశం సంస్మరణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు.పిడికెడు మందితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం తర్వాత విస్తృత స్థాయికి చేరుకున్నప్పటికీ, పదేళ్లపాటు అధికారంలో ఉన్న నాయకులు ఉద్యమకారులను మరచిపోయారని విమర్శించారు. ఉద్యమంలో సర్వం కోల్పోయిన వేలాది కుటుంబాలు ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయని తెలిపారు.ఉద్యమకారుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే గత ప్రభుత్వం అధికారానికి దూరమైందని ఆయన ఆరోపించారు. ఉద్యమాన్ని అణచిన వారికే ప్రాధాన్యం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ ప్రాంతానికి చెందిన ఉద్యమకారుల సమస్యలను పలుమార్లు నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు.అమరుల కుటుంబాల ఆవేదన వృథా కాదని, వారి త్యాగాలను గుర్తించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారులు, అమరుల కుటుంబాలకు సహాయం అందించే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.ప్రస్తుతం పదవులు అనుభవిస్తున్న నాయకులు ముందుకు వచ్చి ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సహాయ కార్యక్రమాలు ఇంకా అమలు కాలేదని పేర్కొన్నారు.





