నేటి సాక్షి – కోరుట్ల*(రాధారపు నర్సయ్య)కోరుట్ల పట్టణంలో ఉపాధ్యాయురాలు విద్యార్థిని కర్రతో చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సంచలనం రేపింది. ఐదవ తరగతి చదువుతున్న మచ్చ సాత్విక్ అనే విద్యార్థిపై జరిగిన ఈ దాడితో అతని శరీరంపై రక్తం గడ్డకట్టిన గాయాలు ఏర్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.*గౌతమ్ హైస్కూల్లో జరిగిన ఘటన*కోరుట్ల పట్టణంలోని గౌతమ్ హైస్కూల్లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మచ్చ శ్రీకాంత్, సంజన దంపతుల కుమారుడు మచ్చ సాత్విక్ (12) ఐదవ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో పిల్లలు ఆడుకుంటుండగా మరో విద్యార్థితో చిన్నపాటి గొడవ జరిగింది. ఈ విషయం గమనించిన ఉపాధ్యాయురాలు విద్యుల్లత కోపోద్రిక్తురాలై సాత్వీక్ను కర్రతో విచక్షణ రహితంగా కొట్టినట్లు విద్యార్థి బంధువులు తెలిపారు.*తీవ్ర గాయాలతో బాలుడు*ఉపాధ్యాయురాలి దెబ్బలతో బాలుడి ఎడమ చేయి, వీపు భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. శరీరంపై రక్తం గడ్డకట్టిన గాయాలు కనిపించడంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏడుస్తూ ఇంటికి చేరిన సాత్విక్ను చూసి తల్లి సంజన కన్నీరు పెట్టుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.*ప్రిన్సిపాల్ పై పేరెంట్స్ ఆగ్రహం*ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలుడి తండ్రి మచ్చ శ్రీకాంత్, కుటుంబ సభ్యులు హుటాహుటిన గౌతమ్ హైస్కూల్కు చేరుకుని పాఠశాల ప్రిన్సిపాల్ గోపిని నిలదీశారు. చిన్నపాటి గొడవ జరిగితే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాల్సింది పోయి ఇలా విచక్షణా రహితంగా కొట్టడం ఏమిటని ప్రశ్నించారు. అయితే ప్రిన్సిపాల్ కేవలం సారీ చెప్పి చేతులు దులుపుకుందని వారు వాపోయారు.*విచారణ చేస్తామని ప్రిన్సిపాల్*ఈ ఘటనపై స్పందించిన పాఠశాల ప్రిన్సిపాల్ గోపి, విద్యార్థిని కొట్టిన విషయం నిజమేనని అంగీకరించారు. ఘటనపై విచారణ జరిపి సంబంధిత ఉపాధ్యాయురాలు విద్యుల్లతపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా బాలుడి గాయాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గౌతమ్ హైస్కూల్ అడ్మినిస్ట్రేషన్పై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులపై ఇలాంటి దాడులు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ కోరుతున్నారు.______





