నేటి సాక్షి గజ్వేల్, ఫిబ్రవరి 18: పేద ప్రజల జీవనోపాధికి రాజ్యాంగబద్ధమైన హక్కుగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పద్ధతిగా నిర్వీర్యం చేస్తోందని డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. గజ్వేల్ మండలం పాతూర్ గ్రామంలోని ఉపాధి హామీ పని ప్రదేశాన్ని బుధవారం సందర్శించిన ఆయన కూలీలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.ఉపాధి హామీ చట్టం ప్రకారం సంవత్సరానికి 100 రోజుల పని కల్పించాల్సి ఉండగా, కూలీలకు 50 రోజుల పని కూడా చూపించకుండా వేతనాలను నెలల తరబడి పెండింగ్లో ఉంచుతున్నారని మండిపడ్డారు. సగటున 52 రోజుల పని కూడా ఇవ్వలేని ప్రభుత్వం, ఇప్పుడు కొత్త చట్టం పేరుతో 125 రోజుల పని ఇస్తామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని విమర్శించారు.కూలీలకు పని హక్కును చట్టబద్ధం చేసిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేసి,‘విబి- జీ రామ్- జీ–2025 పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురావడం ద్వారా కూలీల హక్కులను కుదించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. గత ఐదేళ్లలో లక్షలాది జాబ్ కార్డులను తొలగించడం ద్వారా పేదలను ఉపాధి నుండి దూరం చేశారని పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా కోట్లాది కూలీల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడి వాటిని రద్దు చేసుకున్నట్లే, కూలీలు కూడా ఐక్య పోరాటంతో తమ హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, వేతనాలను సకాలంలో చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





