నేటి సాక్షి -జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులు, అదనపు ప్రిసైడింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని ఎన్నికల జనరల్ అబ్సర్వర్ ఖర్టాడే కాళీచరణ్ సుదామా రావు ఐఏఎస్ స్పష్టం చేశారు.సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో ప్రిసైడింగ్ అధికారులు, అదనపు ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని ఎన్నికల జనరల్ అబ్సర్వర్ ఖర్టాడే కాళీచరణ్ సుదామా రావు, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ తరగతులను పరిశీలిస్తూ పలు అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు.*ఎన్నికల విధులపై సమగ్ర అవగాహన అవసరం*ఈ సందర్భంగా ఎన్నికల జనరల్ అబ్సర్వర్ మాట్లాడుతూ… రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల విధులు అత్యంత కీలకమైనవని, ప్రతి అంశంపై క్షుణ్ణంగా అవగాహన కలిగి విధులను నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల ముందు రోజు ఎన్నికల సామాగ్రి సేకరణ, పూర్తి సామాగ్రి ఉందో లేదో సరిచూసుకోవడం, ఓటర్ లిస్ట్, బ్యాలెట్ పేపర్స్ పరిశీలన, బ్యాలెట్ బాక్స్ సీలింగ్ విధానం వంటి అంశాలపై స్పష్టత ఉండాలన్నారు.*పోలింగ్ రోజు నుంచి లెక్కింపు వరకు జాగ్రత్తలు*అదేవిధంగా ఛాలెంజ్ ఓటు, టెండర్ ఓటు, బ్యాలెట్ పేపర్స్ జారీ విధానం, పీఓ డైరీ నింపడం, అన్ని ఫార్మ్లను సరైన విధంగా నింపడం, పోలింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాల్సిన చోట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలింగ్ పూర్తయిన అనంతరం బ్యాలెట్ బ్యాక్ సీలింగ్, ఓట్ల లెక్కింపు వంటి అంశాలను నిబంధనల ప్రకారం నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు వారికి కేటాయించిన ప్రదేశాల్లోనే తప్పనిసరిగా బస చేయాలని జనరల్ అబ్సర్వర్ పేర్కొన్నారు.*నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యం*ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్ మాట్లాడుతూ… ఎన్నికల ప్రక్రియను పూర్తిస్థాయిలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రిసైడింగ్ అధికారులదేనని స్పష్టం చేశారు. ‘పోలింగ్ డే’ నాడు అనుసరించాల్సిన విధివిధానాలు, పోలింగ్ స్టేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు సంబంధించిన అంశాలపై స్పష్టమైన సూచనలు చేశారు.*సమన్వయంతో విధులు నిర్వహించాలి*పోలింగ్ ఆఫీసర్లు ఎన్నికల విధులను అత్యంత బాధ్యతతో నిర్వహించాలని, ప్రతి పీఓ తమ పాత్రను సమర్థంగా నిర్వర్తించాలని జిల్లా అదనపు కలెక్టర్ సూచించారు. ప్రతి పీఓ తమ అదనపు పీఓలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.*టీవోటీల ద్వారా విస్తృత శిక్షణ*ఈ శిక్షణ కార్యక్రమంలో టీవోటీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రిసైడింగ్ అధికారుల విధులు, బాధ్యతలు, ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తిస్థాయిలో వివరించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్, జీవాకర్ రెడ్డి, నోడల్ అధికారులు రాము, రవికుమార్, కళాశాల ప్రిన్సిపాల్ అశోక్, మున్సిపల్ కమిషనర్లు, టీవోటీలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.________





