నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 10 ~అన్నమయ్య జిల్లా :-: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, అప్పులపై మరో సారి కూటమి ప్రభుత్వం నేతల మధ్య గత వైసీపీ ప్రభుత్వ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం నారా చంద్రబాబు నాయుడుపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల చంద్రబాబు విడుదల చేసిన స్థూల ఉత్పత్తి లెక్కలు పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఎప్పటిలాగే పిచ్చి లెక్కలు, కాకి లెక్కలు చెబుతున్నారు. ప్రజలు ఇవి నమ్మరని విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ విధ్వంసమయిందని చంద్రబాబు వ్యాఖ్యానించడం వ్యూహాత్మక ప్రచారం తప్ప మరేమీ కాదన్నారు. ఏడాదిన్నర గడిచినా కూడా చంద్రబాబు ఇంకా గత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తుండటం బాధాకరమని బుగ్గన మండిపడ్డారు. మీ పాలనలో మీరు 4.5 శాతం కేంద్రానికి ఇచ్చారు. కోవిడ్ ఉన్నా కూడా మా ప్రభుత్వం 4.8 శాతం ఇచ్చింది. మరి ఎవరు బాగా ఇచ్చారో అర్థం అవుతుందని వివరించారు. తలసరి ఆదాయం తగ్గిందనే చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ జాతీయ స్థాయిలో ఆదాయం తగ్గినా వైసీపీ పాలనలో పెరిగిందని చెప్పారు. ఆర్బీఐ, కంఫ్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్కలు తప్పంటూ కేవలం తాను చెప్పినవే నిజమన్నట్టు చంద్రబాబు మాట్లాడటం విచిత్రమని బుగ్గన ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం రూ.3.32 లక్షల కోట్లు అప్పులు మాత్రమే చేసిందని కానీ, చంద్రబాబు తన హయాంలో పరిమితికి మించి అప్పులు చేసి రాష్ట్రాన్ని బాదుడులోకి నెట్టారని బుగ్గన రాజేందర్ ఆరోపించారు. పోలవరం నిధులను చంద్రబాబు వేరే దారిలో మళ్లించారని, చంద్రబాబు అసమర్ధతతో కూడిన ధ్వంసానికిదే నిదర్శనమని మండిపడ్డారు. ఇంతకు ముందు వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలా అవుతుందని చంద్రబాబు ప్రచారం చేశారని గుర్తుచేస్తూ అయితే ఇప్పుడు బాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ కొలంబో అవుతుందా అని బుగ్గన రాజేందర్ ప్రశ్నిస్తూ దీనిపై బాబు సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉందని పంటలను కోసే సమయంలో కూడా వ్యవసాయ కార్మికులు లేకపోవడం చంద్రబాబు పాలన వైఫల్యానికి నిదర్శనమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.~~~~~~~~~~~~~~~~~





