నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)న్యూఢిల్లీ/తిరుపతి: ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యా రంగంలో నెలకొన్న ప్రస్తుత సంక్షోభంపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాలలో బాగంగా మంగళవారం అత్యంత ముఖ్యమైన ప్రజా సమస్యలు ప్రస్తావించే అధికరణ 377 కింద రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించారు. ప్రజల ధనంతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యను విస్తరించాలనే సదుద్దేశంతో 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం జరిగింది. వీటిలో ఇప్పటికే 7 కాలేజీల నిర్మాణాలు పూర్తయ్యాయని, మరికొన్ని చివరి దశలో ఉన్నాయని ఎంపీ గుర్తు చేశారు.అయితే, నిర్మాణాలు పూర్తయి సిద్ధంగా ఉన్న కాలేజీలకు కూడా అనుమతులు ఇవ్వడంలో జరుగుతున్న అనవసర జాప్యం అత్యంత దురదృష్టకరమని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జాప్యం కారణంగా, ఈ విద్యాసంవత్సరంలో సుమారు 1000కి పైగా ఎంబీబీఎస్ సీట్లను కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎంతోమంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండటంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని డాక్టర్ గురుమూర్తి తెలిపారు. ప్రైవేట్ యాజమాన్యాలు కేవలం లాభాపేక్షతో పనిచేస్తాయని, అదే జరిగితే పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలా మారుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా వెనుకబడిన జిల్లాల్లో ప్రజలకు వైద్య సేవలు దూరమవుతాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో, కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డాక్టర్ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. సిద్ధంగా ఉన్న ప్రభుత్వ కాలేజీలకు వెంటనే అనుమతులు మంజూరు చేసి, ఏపీలో ప్రభుత్వ వైద్య విద్యా రంగాన్ని రక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.





