నేటి సాక్షి, తిమ్మాపూర్:కంట్లో కారం చల్లి తులం బంగారు గొలుసుతో పాటు రూ. వెయ్యి అపహరించిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నేదునూర్ గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గన్నేరువరం మండలం గుండ్లపల్లె గ్రామానికి చెందిన తమ్మనవేణి కొమురయ్య తిమ్మాపూర్ మండలం నేదునూర్ గ్రామంలో ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి తన పనులు ముగించుకొని, బైక్పై గుండ్లపల్లె ఎక్స్రోడ్ దగ్గరున్న ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో ఓ వ్యక్తి లిఫ్ట్ అడగ్గా, అతడిని ఎక్కించుకునేందుకు బైక్ ఆపాడు. దీంతో అతడు కంట్లో కారం చల్లగా.. మరో వ్యక్తి వెనక నుంచి వచ్చి ఎటూ కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. వారిద్దరు కలిసి మెడలో ఉన్న తులం బంగారు గొలుసు, జేబులోని వెయ్యి రూపాయలు లాక్కొని, తలపై గట్టిగా కొట్టి పరారయ్యారు. బాధితుడు కొమురయ్య ఫిర్యాదుమేరకు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎల్ఎండీ ఎస్ఐ అన్వర్ తెలిపారు.




