నేటి సాక్షి గజ్వేల్, మార్చి 21: గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని ఫలితాలు సాధించినప్పటికీ, స్వల్ప తేడాతో పీఠాన్ని కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి తెలిపారు. ప్రజ్ఞాపూర్లో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజల మద్దతు లభించిందని, అయితే భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) అభ్యర్థులతో పోలిస్తే ఆర్థిక వనరులు సమకూర్చలేకపోవడం వల్ల ఫలితాలపై ప్రభావం పడిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని, ఓడిన అభ్యర్థులకు పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.గజ్వేల్ ప్రజలు కాంగ్రెస్కు అండగా నిలిచారని, వారి విశ్వాసాన్ని నిలబెట్టేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలను సమర్థంగా అమలు చేస్తోందని అన్నారు. రానున్న కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై విమర్శలు గుప్పిస్తూ, బిఆర్ఎస్ నాయకుల అవినీతి, అక్రమాలపై చర్యలు తప్పవని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పట్టణ పార్టీ అధ్యక్షుడు మొనగారి రాజు, ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్, పిసిసి కార్యదర్శి నాయిని యాదగిరి, కొల్లూరి సత్యం, కొండపోచమ్మ డైరెక్టర్ గుండు లక్ష్మణ్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు షరీఫ్, నేతలు సారిక శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి, నరేష్ గౌడ్, పెరిక నాగరాజు, రాంబాబు, చీర్ల కృష్ణ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





