నేటి సాక్షి గజ్వేల్…గజ్వేల్ పట్టణంలో కొత్త బస్టాండ్ నిర్మాణం సంవత్సరాలుగా పూర్తికాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత బస్టాండ్ను కూల్చివేసిన అనంతరం అదే స్థలంలో ఆధునిక సదుపాయాలతో కొత్త భవనం నిర్మించేందుకు నిధులు కేటాయించగా, అప్పటి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆదేశాలతో పనులు ప్రారంభమయ్యాయి. అయితే నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు.బస్టాండ్ లేకపోవడంతో గజ్వేల్ నుంచి సంగారెడ్డి, భువనగిరి, దుబ్బాక, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రహదారుల పక్కనే నిలబడి బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. ఎండ, వాన తేడా లేకుండా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కూర్చునే సదుపాయం, తాగునీరు, మరుగుదొడ్లు, సరైన లైటింగ్ వంటి మౌలిక వసతులు లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చుతోంది.నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, తగిన పర్యవేక్షణ లేకపోవడం ఆలస్యానికి కారణమని చెబుతున్నారు. పనుల నాణ్యతపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు పనుల పురోగతిని సమీక్షించి, నిర్దిష్ట గడువుతో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.





