నేటి సాక్షి గజ్వేల్, ఫిబ్రవరి 12:కార్మికుల చెమట చుక్కలను దోపిడీ చేస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా గజ్వేల్ పట్టణంలో కార్మికులు ఘాటుగా నిరసన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.సిద్దిపేట జిల్లా సిఐటియు పిలుపుతో జరిగిన ఈ ర్యాలీలో ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు, ఆశా వర్కర్లు, గ్రామపంచాయతీ కార్మికులు, వివిధ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నినాదాలతో పట్టణ వీధులు మార్మోగాయి.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు సందెబోయిన ఎల్లయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరచే విధానాన్ని ఉపసంహరించుకోవాలని, కార్మికులకు కనీస వేతనాలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని ఆయన స్పష్టం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి పేరు మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి సహా ఇతర నాయకులు పాల్గొన్నారు.

