*నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా కోరుట్ల మండలం లోని ఎఖీన్పూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు స్థానికంగా నిర్వహించిన క్షేత్ర పర్యటనలో భాగంగా సంప్రదాయ వృత్తుల శాస్త్రీయ ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ‘కుమ్మరుల సారె’పై మట్టి పాత్రల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా వీక్షించి అవగాహన పొందారు.*మట్టి పాత్రల తయారీపై విద్యార్థులకు అవగాహన*విద్యార్థులు కుమ్మరి వృత్తిదారులు చక్రంపై మట్టిని ఉపయోగించి పాత్రలను ఎలా తయారు చేస్తారో పరిశీలించారు. మట్టిని శుద్ధి చేయడం నుంచి ఆకారంలోకి తేవడం, ఎండబెట్టడం, కాల్చడం వరకు ప్రతి దశను తెలుసుకున్నారు. సంప్రదాయ వృత్తుల్లో దాగి ఉన్న శాస్త్రీయ విధానాలను ఉపాధ్యాయులు వివరించారు.*ఆరోగ్య పరిరక్షణలో మట్టి పాత్రల అవసరం*ప్రస్తుత పరిస్థితుల్లో క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్లాస్టిక్, రసాయన పదార్థాల వినియోగాన్ని తగ్గించి మట్టి పాత్రలను ఉపయోగించడం ఎంత ముఖ్యమో వివరించారు. మట్టి పాత్రల్లో వండిన ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుందని, పర్యావరణానికి అనుకూలమని విద్యార్థులు తెలుసుకున్నారు.*ఇటుకల తయారీ విధానం*అలాగే విద్యార్థులు ఇటుక బట్టీలను సందర్శించి మట్టితో ఇటుకలను ఎలా తయారు చేస్తారో ప్రత్యక్షంగా గమనించారు. మట్టి మిశ్రమం తయారీ, అచ్చుల్లో నింపడం, ఎండబెట్టడం, భట్టీలో కాల్చడం వంటి దశలను పరిశీలించారు. నిర్మాణ రంగంలో ఇటుకల ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించారు.ఈ క్షేత్ర పర్యటనలో ప్రధానోపాధ్యాయులు మార్గం రాజేంద్రప్రసాద్, సైన్స్ టీచర్ సంజీవ రాణి పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.__________





