నేటి సాక్షి గజ్వేల్ :—-ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గజ్వేల్ ప్రభుత్వ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మంగళవారం భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆసుపత్రి ఆర్ఎంవో డా.రాము శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం మహాదానమని, అన్ని దానాల్లో ప్రాణదానం మిన్న అని పేర్కొన్నారు. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, ప్రసవ సమయాల్లో రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. అటువంటి పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు రక్తదాన శిబిరాలు ఎంతో కీలకమని అన్నారు. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, దానం ద్వారానే రక్తం లభిస్తుందని వివరించారు. రక్తదానం పూర్తిగా సురక్షితమని, ఆరోగ్యానికి హానికరం కాదని స్పష్టం చేశారు. శిబిరంలో మొత్తం 32 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ వైస్ ప్రెసిడెంట్ డా.కుమార్ స్వామి మాట్లాడుతూ ప్రజల్లో రక్తదానంపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాతలకు పండ్లు, జ్యూస్ పంపిణీ చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎంవో-2 డా.ప్రణీత, బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జ్ డా.భవాని, జనరల్ ఫిజీషియన్ డా.సుమన్, హెల్త్ ఇన్స్పెక్టర్ లక్ష్మి, హెడ్ నర్సులు ఉమామహేశ్వరి, రోజులిన్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది దేవేందర్, నర్సింగ్ ఆఫీసర్లు బాలకిషన్, శ్రీనివాస్, నవీన్, ల్యాబ్ టెక్నీషియన్లు రాజు, కరుణాకర్, గౌతమ్, మహేందర్, నజీర్ అహ్మద్, హెల్త్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవ్, ఆరోగ్యమిత్ర సురేందర్, గజ్వేల్ యువజన సంఘం అధ్యక్షుడు తలకొక్కుల ప్రేమ్ కుమార్, అపన్న హస్తం ప్రధాన కార్యదర్శి కటుకం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.





