నేటి సాక్షి వికారాబాద్:గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీమతి స్నేహ మెహ్ర,జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించి, పోలీస్ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాతలకు నివాళులు అర్పించి, భారత రాజ్యాంగ విలువల ప్రాధాన్యతను వివరించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు, స్వేచ్ఛలను కల్పించిందని, అలాగే బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాలను నిబద్ధతతో, నిజాయితీతో నిర్వర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజ్యాంగ ఆత్మతో పాటు ప్రజాస్వామ్య విలువలే భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టాయని ఆమె పేర్కొన్నారు.దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాలను కాపాడటం ప్రతి పౌరుడి సామూహిక బాధ్యత అని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్న ఆమె, పోలీస్ అధికారులు క్రమశిక్షణ, అంకితభావం మానవీయ దృక్పథంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజల సమస్యలను సానుభూతితో విని పరిష్కరించే ప్రజా స్నేహపూర్వక పోలీసింగ్ ద్వారా ప్రజల విశ్వాసం మరింత బలపడుతుందని ఆమె తెలిపారు.అలాగే నేర నివారణ, ట్రాఫిక్ నియంత్రణ, మహిళలు పిల్లల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన వంటి అంశాల్లో పోలీసులు మరింత చురుకుగా పనిచేయాలని ఆమె సూచించారు. శాంతియుత, స్నేహ పూర్వక సమాజ నిర్మాణానికి పోలీసులు ప్రజలు కలిసికట్టుగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.వేడుకల ముగింపులో జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర, జిల్లా పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి. రాములు నాయక్, వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ వీరేష్, ఎస్బీఐ వెంకటపతి రాజు, ఆర్ఐలు తదితర అధికారులు పాల్గొన్నారు.





