నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లా గొల్లపల్లిమండలం పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గొల్లపల్లి మరియు కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో సోమవారం మండల కేంద్రంలోని రెడ్డి సంఘ భవనంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ ముస్కు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన ఈ శిబిరంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన 90 మందికి కంటి పరీక్షలతో పాటు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. వీరిలో 35 మందికి కంటి శుక్లాల ఆపరేషన్లు అవసరమని వైద్యులు గుర్తించారు. ఆపరేషన్లకు ఎంపికైన 35 మందిని రేకుర్తి కంటి ఆసుపత్రికి ప్రత్యేక బస్సులో తరలించారు. ఆపరేషన్ చేయించుకునే వారితో పాటు, వారి వెంట వెళ్లే సహాయకులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం, భోజనం మరియు వసతి సౌకర్యాలను కల్పిస్తున్నట్లు కరుణాకర్ రెడ్డి వివరించారు. ఎటువంటి ఖర్చు లేకుండా పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి లయన్ నరహరి, క్లబ్ సభ్యులు తాడూరి సత్యనారాయణ, మహంకాళి చంద్రశేఖర్ ,సట్టా సురేష్, వైద్య బృందం మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

