నేటి సాక్షిరాష్ట్రంలో గోదావరి పుష్కరాలకు అవసరమైన ఏర్పాట్లకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, దేవాదాయ) శైలజ రామయ్యర్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గోదావరి నది తీరం గల జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో గోదావరి పుష్కర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో గోదావరి నది తీరంలో జరగనున్న పుష్కరాల సంబంధిత ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో నివేదికలు తయారు చేసి సమర్పించాలని తెలిపారు. పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు, వైద్య శిబిరాల ఏర్పాటు, గజ ఈతగాళ్ల ఏర్పాటు, బందోబస్తు ఇతర పూర్తి స్థాయి సదుపాయాలు కల్పించే దిశగా ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో గోదావరి పుష్కరాలు నిర్వహించడానికి చేయవలసిన ఏర్పాట్లను, సంబంధించిన అంశాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో గోదావరి పుష్కరాలు ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా జరిపేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మంచిర్యాల గోదావరి తీరంలో పుష్కర స్నానం కోసం సమీప జిల్లాల నుండి కాకుండా అనేక ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు హాజరు కావడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల, జైపూర్ ఎ సి పి లు ప్రకాష్, వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, నీటిపారుదల శాఖ డి ఈ ఈ వేణుగోపాల్ రావు, ఈ ఈ వెంకటేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

