నేటి సాక్షి మహబూబాబాద్(భూక్యా రవి నాయక్) జనవరి 22 మరిపెడ మండలంలో అక్రమ మద్యం వ్యాపారం రోజు రోజుకు హద్దులు దాటుతోంది. వైన్ షాప్ నిర్వాహకులు చట్టాన్ని లెక్కచేయకుండా నేరుగా గ్రామాల్లోకి తిరుగుతూ బెల్టు షాపులకు మద్యాన్ని సరఫరా చేస్తున్నారని మండల ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారులు కాకుండా లోపలి గ్రామ మార్గాలను ఉపయోగిస్తూ, రాత్రివేళల్లోనూ పగటిపూట కూడా నిర్భయంగా మద్యం తరలింపు కొనసాగుతోంది.ఈ వ్యవహారం ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలియకుండానే జరుగుతోందా..? లేక తెలిసే కళ్లుమూసుకుంటున్నారా..? అనే అనుమానాలు బలపడుతున్నాయి. గుడుంబా తయారీ కేంద్రాలపై మాత్రం మెరుపు దాడులు చేస్తూ వార్తల్లో నిలిచే ఎక్సైజ్ శాఖ, అధికారిక మద్యం అక్రమంగా గ్రామాలకు చేరుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి.గ్రామాల్లో యువత మద్యానికి బానిసలవుతూ కుటుంబాలు ఛిద్రమవుతున్నా, మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా అధికార యంత్రాంగంలో ఎలాంటి స్పందన కనిపించడం లేదు. వైన్ షాప్ నిర్వాహకుల అత్యుత్సాహమే ఈ అక్రమాలకు కారణమా..? లేక అధికారుల నిర్లక్ష్యమే మద్యం మాఫియాకు రక్షణగా మారిందా..? అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి.ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాలకు నేరుగా జరుగుతున్న మద్యం అక్రమ తరలింపుపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై తక్షణమే కేసులు నమోదు చేయాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు





