నేటి సాక్షి నల్లబెల్లి ప్రతినిధి అక్టోబర్ 30 :పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా నల్లబెల్లి మండలం కొండాపురం గ్రామంలో తహసీల్దార్ ముప్పు కృష్ణ అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. తహసిల్దార్ ముప్పు కృష్ణ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ చదువు లేక ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన లేక ఎన్నో ప్రభుత్వ పథకాలకు ఈ గిరిజన ప్రజలు దూరమవుతున్నారని, భారత రాజ్యాంగం నందు మీకొరకు పొందుపరచిన రిజర్వేషన్లు, ప్రత్యేకంగా కేటాయించిన పధకాలు పొందడం కూడా మీ హక్కుగా భావించాలని తెలియజేశారు. ఆధార్ కార్డులు రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. మీ అవసరాలను అర్జీ రూపంలో తీసుకొని వచ్చిన ఎడల చట్టపరిధిలో మీకు న్యాయం చేయగలనని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శుభనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్క మనిషికి రాజ్యాంగపరంగా జీవించే హక్కు ఉందని ఇతరుల స్వేచ్ఛకు భంగం కలగనంత వరకు మీ స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చని తెలియజేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం నందు పొందుపరిచిన ఫలాలను ఉపయోగించుకొని ప్రతి ఒక్క పేద విద్యార్థి అభివృద్ధి చెందాలని సూచించారు. వ్యవసాయ అధికారి బన్న రజిత మాట్లాడుతూ పిల్లలు తన తల్లి దగ్గర ఎలాగైతే మారాం చేసి తన కోర్కెలను తీర్చుకుంటారో అదే విధంగా పేద ప్రజలు ప్రభుత్వం దగ్గర తమకు వచ్చిన పథకాలను అడిగి తీసుకునే హక్కు ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో తహసిల్దార్ ముప్పు కృష్ణ,ఎంపీడీవో శుభనివాస్, వ్యవసాయ అధికారి బన్న రజిత, ఎం ఏ ఓ, ఏ ఎస్ఐ, మండలాధికారులు గ్రామ కార్యదర్శి, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.





