నేటి సాక్షి, ఎండపల్లి:* పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా జరుపుకునే ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని శుక్రవారం ఉమ్మడి వెల్గటూర్ మండలంలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. గుల్లకోట, శాఖపూర్, జగదేవ్పేట్, అంబారీపేట, పాతగూడూర్ గ్రామాల్లోని ఈద్గాల వద్దకు తెల్లవారుజామునే ముస్లిం సోదరులు తరలివచ్చి ప్రత్యేక సామూహిక (నమాజ్) ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇమామ్లు పవిత్ర ఖురాన్ సందేశాలను వివరిస్తూ మానవత్వం, సహనం, దాతృత్వం, సోదరభావం వంటి విలువలను ఆచరించాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, సామరస్యం నెలకొనాలని, దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ప్రార్థనలు చేశారు. నమాజ్ అనంతరం ముస్లింలు పరస్పరం ఆలింగనం చేసుకుంటూ “ఈద్ ముబారక్” అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా పలు చోట్ల పేదలకు ‘జకాత్-ఉల్-ఫితర్’ పేరుతో దానధర్మాలు నిర్వహించారు. చిన్నారులు, యువకులు కొత్త దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రామాల్లో పండుగ సందడి నెలకొని ప్రజలు ఆనందంగా వేడుకల్లో పాల్గొన్నారు.పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఈద్గాలను సందర్శించి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపి, రాష్ట్ర ప్రభుత్వం అందించిన తోఫాలను పంపిణీ చేశారు. కాగా ఈ వేడుకలు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాయని, అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో కలిసి పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఉమ్మడి మండల మాజీ కో-ఆప్షన్ సభ్యులు మహ్మద్ రియాజ్, మజీద్ సదర్లు ఫకీరోద్దిన్, రఫీక్, అనిఫ్, కజామియా, నసీరుద్దీన్, రషీద్, ఖాసీం, అబ్దుల్లా, అల్లీ సాబ్, మతపెద్దలు మహ్మద్ సలీం, హఫీజ్, తాజ్, నాసర్, ముస్తఫా, అమ్జత్, నజీర్, బాబర్, సాధుల్లా, సాదిక్, సులేమాన్, షాహిద్, అజార్, షరీఫ్, ఇమామ్, మౌజన్లు తదితరులు పాల్గొన్నారు.





