కథలాపూర్*( రాధారపు నర్సయ్య )కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో మీసేవ కేంద్రం ఏళ్లుగా పనిచేయకుండా మూతపడి ఉందని, కేంద్ర నిర్వాహకుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మీసేవను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపిస్తూ గ్రామ యువకులు కోరుట్ల ఆర్డీఓ జీవాకర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ధ్రువీకరణ పత్రాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆ ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు.*వేరే ల్యాప్టాప్లో మీసేవ సాఫ్ట్వేర్ వినియోగం*గ్రామ యువకుల కథనం ప్రకారం, చింతకుంట మీసేవ కేంద్రానికి కేటాయించిన సాఫ్ట్వేర్ను తీసుకుని, వేరే ల్యాప్టాప్లో అప్లోడ్ చేసుకుని ఉపయోగిస్తున్నట్లు ఆరోపించారు. సదరు మీసేవ నిర్వాహకుడు కర్ని శ్రీనివాస్ కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య మిత్రగా విధులు నిర్వహిస్తూ, అక్కడే ఏదో ఒకటి రికార్డు కోసం డేటా లోడ్ చేస్తున్నాడని తెలిపారు.*చింతకుంటలో ఎప్పుడూ మీసేవ ఓపెన్ కాలేదన్న ఆరోపణ*మీసేవ కేంద్రాన్ని చింతకుంట గ్రామంలో ఏ రోజు కూడా సరిగా తెరిచిన దాఖలాలు లేవని గ్రామస్తులు ఆరోపించారు. ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ, నివాస, కుల ధ్రువీకరణల కోసం ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మీసేవ కేంద్రం నిరంతరం తాళం వేసి ఉండటంతో గ్రామ ప్రజలు ఇతర గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.*రెవెన్యూ అధికారుల విచారణ*గ్రామ యువకులు చేసిన ఫిర్యాదు మేరకు విచారణ నిమిత్తం కథలాపూర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవీందర్, చింతకుంట రెవెన్యూ ఆఫీసర్ గోరుమంతుల సుధాకర్ గ్రామానికి వచ్చి పరిశీలించారు. పరిశీలన సమయంలో మీసేవ కేంద్రం యథావిధిగా తాళం వేసి ఉండటం గమనించారు. ఎందుకు కేంద్రం తెరవలేదన్న ప్రశ్నకు సరైన సమాధానం లభించలేదని తెలిసింది.*ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మీసేవ నిర్వహణపై అభ్యంతరం*మీసేవ కేంద్రం అనేది నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినదని గ్రామ యువకులు పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి మీసేవను కొనసాగిస్తూ, గ్రామ ప్రజలకు సేవలు అందించకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంగా సదరు వ్యక్తి నుంచి మీసేవను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా గ్రామ యువకుల తరఫున సోమ ప్రవీణ్ మాట్లాడుతూ, మీసేవ నిర్వాహకుడికి ఇప్పటికే ఉపాధి ఉన్నందున, ఉపాధి లేని యువకులకు ఈ అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. ప్రజలకు సేవ చేయని మీసేవ కేంద్రాన్ని కొనసాగించడం వల్ల గ్రామానికి ఎలాంటి ఉపయోగం లేదని, వెంటనే మీసేవను రద్దు చేసి నిరుద్యోగ యువకులకు కేటాయించాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ను, జిల్లా కలెక్టర్ను కోరినట్లు తెలిపారు.*ఆర్డీఓకు నివేదిక అందజేతకు సన్నాహాలు*స్థానికంగా విచారణ నిర్వహించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవీందర్, పూర్తి వివరాలతో నివేదికను కోరుట్ల ఆర్డీఓకు అందించనున్నట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా మీసేవ కేంద్రంపై తగిన చర్యలు తీసుకుంటారని గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.*నిరుద్యోగ యువకులకు మీసేవ కేటాయించాలని డిమాండ్*చింతకుంట గ్రామంలో ప్రజలకు నిరంతరం సేవలు అందించేలా, ఉపాధి లేని అర్హులైన యువకులకు మీసేవ కేంద్రాన్ని కేటాయించాలని గ్రామ యువకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అధికారుల తక్షణ చర్యలపై గ్రామ ప్రజలు ఎదురు చూస్తున్నారు.———–





