టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావుజిల్లా కలెక్టర్ కు టీడబ్ల్యూజేఎఫ్ నేతల వినతి
నేటి సాక్షి-కరీంనగర్:
జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేసి అందించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపూరావు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కి టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం బాపురావు మాట్లాడారు. జిల్లాలో జర్నలిస్టుల పరిస్థితులు దారుణంగా మారాయని, అనేక ఓడిదుడుకుల మధ్య వృత్తిబాధ్యతలు నిర్వహిస్తున్నారని, చాలీచాలని వేతనాలతో బతుకులీడుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారన్నారని తెలిపారు. అద్దే ఇండ్లలో ఉంటూ దుర్భర జీవితాలు గడుపుతున్న జర్నలిస్టులు చాలామంది ఉన్నారని, జర్నలిస్టుల దయనీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ నివేషణ స్థలాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రం తో పాటు హుజురాబాద్ లో జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించి వెంటనే వారికి నిర్మాణ అనుమతి ఇవ్వాలని ఈ సందర్భంగా కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు గాదె కరుణాకర్ రావు, ఉపాధ్యక్షులు నల్లగొండ సత్తయ్య, సిహెచ్ వెంకట్ రాజు, అతికం రాజశేఖర్, జిల్లా నాయకులు ఆర్ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





