( నేటి సాక్షి): జర్నలిస్టుల సంక్షేమమే టిడబ్ల్యూజేఎఫ్ ధ్యేయం అని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శేరిబాయి గణేష్, మైల సైదులు అన్నారు. బుధవారం చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని శంకర్పల్లి మండల కేంద్రంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా మూడవ మహాసభలో తీసుకున్న తీర్మానాలను జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ప్రధాన ఎజెండా అంశాలుగా చేర్చుకొని సుదీర్ఘంగా వాటిపై చర్చించారు. మహాసభ తీర్మానాలపై జర్నలిస్టులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వర్కింగ్ జర్నలిస్టుగా పని చేస్తున్న వారికి దక్కాల్సిన అక్రిడేషన్ కార్డులు పక్కదారి పట్టకుండా పకడ్బందీగా వ్యవహరించాలని తెలిపారు. జర్నలిస్టులకు ఎలాంటి ఆపద ఉన్న సరైన సమయంలో స్పందించి యూనియన్ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. జర్నలిస్టుల పిల్లలకు రాయితీతో కూడిన విద్య అందించేందుకు మరింతగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ముఖ్యంగా ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు సమస్యలను పరిష్కరించే దిశగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం 43 మందితో జిల్లా పూర్తి స్థాయి కమిటీని జిల్లా కార్యదర్శి మైల సైదులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం కోశాధికారి శ్రీనివాస్ చారి, చేవెళ్ల డివిజన్ అధ్యక్షులు సిహెచ్ రాజు, ప్రధాన కార్యదర్శి జై చంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు ఎం రాజశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గం అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు ఉన్నారు.




