నేటి సాక్షి – హైదరాబాద్*జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుతుండగా, కాంగ్రెస్ పార్టీ వేగం పెంచింది. రానున్న నాలుగు రోజులు గెలుపు సాధనలో కీలకమని పార్టీ అగ్రనాయకులు స్పష్టంగా తెలిపారు. డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జువ్వాడి నర్సింగరావు నేతృత్వంలో ఈరోజు షేక్పేట్ డివిజన్ ఇన్ఛార్జీలతో సమావేశం జరిగింది.—*ప్రతి ఓటరుతో మమేకం*( భట్టి విక్రమార్క పిలుపు )ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలాయి. ప్రతి ఓటరిని వ్యక్తిగతంగా కలవాలి. ప్రజల మనసు గెలుచుకోవడమే అసలు విజయం” అన్నారు. ఆయన పేర్కొంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు..ఇందిరమ్మ హౌసింగ్, మహాలక్ష్మి, రైతు రుణ మాఫీ,కార్యక్రమాలను ఇంటింటికి చేరవేయాలని సూచించారు.*బీసీ బిడ్డ గెలుపే లక్ష్యం*( టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ )టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ మాట్లాడుతూ, “ఈ ఉపఎన్నిక కేవలం జూబ్లీహిల్స్ కోసమే కాదు, తెలంగాణ సమాజం మొత్తం కోసం. ఒక బీసీ బిడ్డ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడాలి. ప్రజల ఆత్మవిశ్వాసం మన విజయం అవుతుంది” అని అన్నారు. ఆయన అన్ని డివిజన్ ఇన్ఛార్జీలను ఉద్దేశించి, బూత్ స్థాయిలో ఓటర్ల జాబితా పరిశీలించి, డోర్ టు డోర్ క్యాంపెయిన్ను వేగవంతం చేయాలని ఆదేశించారు.*ప్రజా సంక్షేమమే బలం*( మంత్రి వివేక్ వెంకటస్వామి )మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి నెరవేర్చే పాలనను చూపించింది. ప్రజా సంక్షేమం మీదే మన గెలుపు ఆధారం. ప్రతి ఓటరికి ఈ విషయం స్పష్టంగా తెలియజేయండి” అన్నారు. ఆయన ‘హైదరాబాద్ మార్పు కాంగ్రెస్ చేతిలోనే సాధ్యం’ అని పేర్కొన్నారు.*స్థానిక బలాన్ని సమన్వయం చేయాలి*( కోరుట్ల ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు )కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ, “ప్రచారం కేవలం పతాకాలు, పోస్టర్లు కాదు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి మన మాట చెప్పాలి. స్థానిక నేతలు, యువత, మహిళలతో సమన్వయం చేస్తే విజయం మన సొంతం అవుతుంది” అన్నారు. ఆయన పార్టీ శ్రేణులకు జాగ్రత్తగా ప్రచారం నిర్వహించాలని, ప్రత్యర్థుల ప్రాచారానికి తగిన సమాధానం ఇవ్వాలని సూచించారు.ఈ సమావేశంలో షేక్పేట్ డివిజన్ కోఆర్డినేటర్లు, బూత్ కమిటీ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నేతలు, యువజన నాయకులు, కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ప్రచార వ్యూహంపై చర్చ జరిపి, రానున్న నాలుగు రోజుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.___





