నేటి సాక్షి – మేడిపల్లి*( రాధారపు నర్సయ్య )18 ఏళ్లుగా సేవా కార్యక్రమాల్లో నిలకడగా ముందంజలో ఉన్న జైర్డ్స్ (JIRDS) స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ అంగడి ఆనంద్కుమార్కు ప్రతిష్టాత్మక ‘తెలంగాణ రత్న సేవా పురస్కార్–2025’ లభించింది. తెలుగు సాంస్కృతిక మహోత్సవాల సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఈ అవార్డును ప్రదానం చేశారు.*మెట్రోపాలిటన్ స్పెషల్ మేజిస్ట్రేట్ చేతుల మీదుగా పురస్కారం*విజయవాడ వెలదండుల హనుమంతరావు గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో మెట్రోపాలిటన్ స్పెషల్ మేజిస్ట్రేట్ దేవ్ నరసింహరావు స్వయంగా ఆనంద్కుమార్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్వే & ల్యాండ్ రికార్డ్స్ ఆర్జెడి CH.V.S.N. కుమార్, తెలంగాణ యూనివర్సిటీ కూచిపూడి మాజీ ప్రిన్సిపాల్ వేదాంత రామలింగ శాస్త్రి, సంస్థ సభ్యులు, గడగండ్ల విజయ్కుమార్ పాల్గొన్నారు.*సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా అవార్డు*భీమారం మండలం, వెంకట్రావుపేట గ్రామానికి చెందిన అంగడి ఆనంద్కుమార్, జైర్డ్స్ సంస్థ ద్వారా గత 18 సంవత్సరాలుగా ఆరోగ్య శిబిరాలు, విద్యా సహాయం, పేదలకు మద్దతు, విపత్తుల సహాయ కార్యక్రమాలు వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నిరంతర సేవాభావం, సామాజిక రంగంలో చూపిన అంకిత భావానికి గుర్తింపుగా అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమైక్య మరియు తెలుగు సాంస్కృతిక మహోత్సవం సంయుక్తంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.______





