నేటి సాక్షి మహబూబాబాద్ మార్చి 3 మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో జరిగిన ఘటన తీవ్ర ఆందోళనకు గురి చేసింది. విద్యార్థుల భద్రతకు ఆదర్శంగా ఉండాల్సిన పాఠశాల ప్రాంగణంలోనే జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు, ప్రజలు షాక్కు గురయ్యారు.సమాచారం ప్రకారం, హాస్టల్లో చోటుచేసుకున్న చిన్న వివాదం తీవ్ర రూపం దాల్చి సీనియర్ విద్యార్థులు జూనియర్లపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. కొంతమందికి చేతులు, కాళ్లు, వెన్నుపూస వద్ద గాయాలైనట్లు తెలిసింది.పాఠశాలలో క్రమశిక్షణా వ్యవస్థ సరిగా అమలు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాస్టల్ వార్డెన్లు, సిబ్బంది పర్యవేక్షణ లోపించడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మా భద్రత ఎవరి బాధ్యత?” అంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.ఈ ఘటనపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను చదువుకోమని పంపితే భయంతో జీవించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పాఠశాలలో సీసీ కెమెరాలు, కఠిన నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? లేక మరొక ఘటన జరిగే వరకు వేచి చూస్తారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.





