నేటి సాక్షి, ఎండపల్లి:* జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రతా క్యాంపెయిన్లో భాగంగా ఎండపల్లి మండలం గోడిశెలపేట గ్రామంలో డిఫెన్సివ్ డ్రైవింగ్పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్గటూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై పి.ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి వాహనదారుడు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ వినియోగించాలి, మద్యం సేవించి వాహనం నడపకూడదని హెచ్చరించారు. అలాగే వేగ పరిమితులను పాటించడం, వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం పూర్తిగా నివారించడం అవసరమన్నారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ ద్వారా ఇతర వాహనదారులను గౌరవిస్తూ ముందస్తు జాగ్రత్తలతో సురక్షితంగా ప్రయాణించవచ్చని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కందికట్ల అమృత-రాజేశం, పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు, వాహనదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.




