నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) నిత్యం గోవింద నామాలు వినిపించే తిరునగరం తిరుపతిలో శుక్రవారం విద్యార్థుల స్ఫూర్తి నినాదాలతో మారు మ్రోగింది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు సందర్భంగా కేంద్ర, రాష్ట్ర, నాయకత్వ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. భారత విద్యార్థి సమైక్య ( ఎస్ఎఫ్ఐ) 25వ రాష్ట్ర మహాసభలను 12, 13,14 తేదీలలో మూడు రోజులు పాటు తిరుపతిలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మహాసభలు ప్రారంభం సందర్భంగా మొదటి రోజు తిరుపతి నగరంలో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. విద్యా కేంద్రంగా ఎదుగుతున్న తిరుపతిలో విద్యార్థులు ఉదయం 8 గంటలకే శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల ముంగిటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఉద్యమ స్ఫూర్తి గీతాలను ఆలపిస్తూ యువతను ఉత్తేజపరిచారు. సరిగ్గా 11 గంటలకు ఐన్ స్టీన్ విగ్రహం నుంచి వేలాదిమంది విద్యార్థులతో ఎస్ఎఫ్ఐ కేంద్ర నాయకత్వం ముందు నడవగా విద్యార్థుల భారీ ప్రదర్శన ప్రారంభమైంది. క్రమశిక్షణకు మారుపేరైన ఎస్ఎఫ్ఐ వాలంటరీల భద్రత నడుమ, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకత్వ పర్యవేక్షణలో ప్రారంభమైన ఈ ర్యాలీ కదిలింది. కామ్రేడ్ కొట్టవిట్టం పెంచులయ్య విప్లవ జ్యోతి వాహనం ముందు కదలగా దాని వెనకే జాతీయ నాయకుల్లో స్ఫూర్తి దాతలు చిత్రపటాలతో బాలికలు అనుసరించగా, ఎస్ఎఫ్ఐ వాలంటరీలు వెంటరాగా, డప్పుల దరువులతో, సాంస్కృత కళారూపాలతో, దేశాన్ని, యువత జీవితాన్ని ఛిద్రం చేస్తున్న కాషాయి పార్టీ ఆగడాలను తలపించే వేషధారణలతో, ఎస్ఎఫ్ఐ కేంద్ర నాయకత్వం ముందు నడవగా వారు వెనువెంటే రాష్ట్ర నాయకత్వం విద్యార్థి లోకం కదిలింది. విద్యార్థి కెరటాలతో మహాసముద్రాన్ని తలపించేలా ఈ భారీ ప్రదర్శన 3 కిలోమీటర్లు దూరం సుమారు రెండు గంటల పాటు సాగింది. బాలాజీ కాలనీలోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలు వేసిన తరువాత టౌన్ క్లబ్ సర్కిల్, మహతి ఆడిటోరియం, తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్, పాత జ్యోతి థియేటర్, రామకృష్ణ ఢీలాక్స్ సర్కిల్, స్విమ్స్ ఎదుట ఉన్న వాల్మీకి సర్కిల్ మీదగా తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా ఉన్న నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ మైదానం వరకు విద్యార్థుల ర్యాలీ ఉద్యమ స్ఫూర్తిని రగిలించే నినాదాలతో సాగింది. పిల్లలనుంచి వృద్ధుల వరకు రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది ఈ మహా ర్యాలీ. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 25వ మహాసభల సందర్భంగా మొదటి రోజు ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు ఆదర్శ యం సాజీ, ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య, రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అక్బర్ భగత్ రవి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర జిల్లా పూర్వ నాయకులు, ఎస్ఎఫ్ఐ సభ్యులు ప్రతినిధులు, విద్యార్థులు భారీ ఎత్తున హాజరయ్యారు.





