నేటి సాక్షి,కుమురం భీమ్ ఆసిఫాబాద్(ఎండి ముబీన్ )జిల్లా ఎస్పీ నితికా పంత్ శనివారం తిర్యాని పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, నమోదు చేసిన కేసుల రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, హాజరు రిజిస్టర్, స్టేషన్ శుభ్రత తదితర అంశాలను పరిశీలించారు.స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెంకటేష్తో పాటు సిబ్బందికి పలు సూచనలు చేస్తూ, శాంతి భద్రతల పరిరక్షణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గ్రామాల్లో చట్టవ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాలపై కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని తెలిపారు.మండల కేంద్రం మరియు గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రజలు, వ్యాపారస్తులను ప్రోత్సహించాలని సూచించారు. స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదిదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రజల విశ్వాసం పెంపొందించే విధంగా సేవలందించాలని పేర్కొన్నారు.మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రాత్రిపూట పర్యవేక్షణ మరియు పెట్రోలింగ్ను కచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజాభద్రతకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.





