నేటి సాక్షి, ధర్మారం (జనవరి 31): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల స్థాయి చీఫ్ మినిస్టర్ కప్ పోటీలను శనివారం నంది మేడారం గ్రామంలోని తెలంగాణ బాలుర గురుకుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో వి.సుమలత, ఎంఈఓ పి. ప్రభాకర్, ఎస్సై ఎం. ప్రవీణ్ కుమార్ పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో భాగంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలను బాలురులకు నిర్వహించారు. బాలికలకు సోమవారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సుమలత మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థి దశలో చాలా ముఖ్యమని, అందరూ క్రీడల్లో రాణించాలని, క్రీడల్లో మంచి పథకాలు సాధిస్తే ఉద్యోగ సాధనలో ఎక్కువ అవకాశం ఉంటుందని తెలిపారు. ఎంఈఓ ప్రభాకర్ మాట్లాడుతూ.. క్రీడలు మానసికోల్లాసంతో పాటు శారీరక దారుఢ్యానికి చాలా ఉపయోగపడతాయని ఈ సీఎం కప్ ఆటలలో క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో పథకాలు సాధించి జిల్లాకు మండలానికి పేరు తీసుకురావాలన్నారు. ఎస్సై ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. క్రీడలు ఎక్కువగా ఆడటం వలన విద్యార్థులు ఒత్తిడిని అధిగమించగలరు, క్రీడలపై సమయాన్ని వెచ్చించడం వలన చెడు దారిన పట్టకుండా ఉంటారని, యువత చెడు వ్యసనాలకు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ నిర్మల, వ్యాయామ ఉపాధ్యాయులు టీ.సౌజన్య, ఎన్. శ్రీనివాస్, బి. కొమురయ్య, టి. కుమార్, భాగ్యలక్ష్మి, నర్మదా, నవిత, బి.శివమణి, సాయికుమార్, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.





