నేటి సాక్షి : మండల కేంద్రమైన పాములపాడులోని, శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబరు-14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారి సి.వి.కృష్ణారెడ్డి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి సి.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ 14వ తేదీన జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ వేడుకలు- బాలల దినోత్సవం, 15వ తేదీ పుస్తక ప్రదర్శన కార్యక్రమం ఉంటుందన్నారు. 16వ తేదీ గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖుల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని, 17, 18 తేదీలలో విద్యార్థిని, విద్యార్థులకు వ్యాసరచన, ఆటల పోటీలు నిర్వహిస్తామని, 19వ తేదీ స్వర్గీయ భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 20వ తేదీన ముగింపు వేడుకలలో గ్రంథాలయాల ప్రాముఖ్యత గురించి నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. కాబట్టి ఈ కార్యక్రమాలలో మండల ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు, పాఠకులు, పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.





