నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.*నామినేషన్ ప్రక్రియకు భద్రతా ఏర్పాట్లు*జగిత్యాల, రాయికల్, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలకు సంబంధించి రేపటి నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసు శాఖ సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేపట్టిందని జిల్లా ఎస్పీ తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధి నిబంధన అమలులో ఉంటుందని, అక్కడ సెక్షన్ 144 కూడా అమలులో ఉంటుందని పేర్కొన్నారు. నామినేషన్ ప్రక్రియకు అనుగుణంగా శాంతిభద్రతలకు భంగం కలగకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు.*నిబంధనలు పాటించాల్సిందే*నామినేషన్ల దాఖలు సందర్భంగా అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలను రెచ్చగొట్టే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించారు. నామినేషన్ కేంద్రాల వద్ద వాహనాల వినియోగం, ఊరేగింపుల నిర్వహణ ఎన్నికల నిబంధనలకు లోబడి ఉండాలని, లౌడ్ స్పీకర్ల వినియోగానికి సంబంధిత అధికారుల అనుమతి తప్పనిసరి అని తెలిపారు.*పరిమితులతో ప్రవేశం*నామినేషన్ సమర్పణకు ఊరేగింపుతో వచ్చే అభ్యర్థి అనుచరులు, మద్దతుదారులు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధి వరకు మాత్రమే అనుమతించబడతారని జిల్లా ఎస్పీ తెలిపారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే ప్రవేశం ఉంటుందని, నామినేషన్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.——





