నేటిసాక్షి, మిర్యాలగూడ : నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో దైవదర్శనానికి వెళ్లిన బిసి రజక కుటుంబాన్ని కుల వివక్షతతో అతికిరాతకంగా కొట్టి 2 నెలల చిన్నపిల్లను కాలితో తొక్కి, హతమార్చిన అక్రవర్ణ రెడ్డి హంతకులను బహిరంగంగా ఉరితీయాలనిబీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి బహుజనుల పై దాడులు హత్యలు పెరిగిపోతున్నాయని, దైవదర్శనానికి వెళ్లిన కుటుంబాన్ని విచక్షణారహితంగా కొట్టడమే కాక చిన్నపిల్లను కాలుతో తొక్కి చంపి రాక్షసులుగా వ్యవహరించిన వ్యక్తులను బహిరంగంగా ఉరి తీయకపోతే, రాష్ట్రంలో ఇలాగే బహుజనుల మీద దాడులు హత్యలు చేస్తూ ఉంటారని ఆయన అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో బహుజనులకు రక్షణ లేకుండా పోయిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటు నుండి నేటి వరకు కూడా బహుజనులను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, మా బహుజనులు మీకు ఓటు వేసి మా ప్రాణాలు మేమే తీసుకుంటున్నాం అన్నారు. ఇంత దారుణం జరిగినా కూడా నేటికి అధికార పార్టీ ఖండించిన పాపాన పోకపోవడం సిగ్గుచేటని, పార్టీలకు మా బహుజనుల ఓట్లు కావాలి తప్ప ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా బాధిత కుటుంబ పక్షాన నిలవకపోవడం బాధాకరం అని, అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే ఈ ఘటనపై స్పందించకపోతే బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడమే కాక మీ కార్యాలయాలను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, ఆఫ్రిత్, ఉదయ్, మహేష్, శేఖర్, ఉపేందర్, గంగాధర్, సిద్ధం రాజు, శేఖర్, మురళి తదితరులు పాల్గొన్నారు.





