నేటి సాక్షి దినపత్రికలో ప్రధాన అంశంగా పేర్కొన్న వార్త కథనానికి స్పందనగా.. బస్సులు ఆపాలని ఆర్టీసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ వార్త కథనం సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడం, ఎక్స్ వేదికగా ‘టీజీఎస్ఆర్టీసీ’ ట్యాగ్ చేసి ట్వీట్ చేయడంతో ఆర్టీసీ డిపో మేనేజర్ జగిత్యాల కు విషయం చేరింది. దీనిపై స్పందించిన ఆర్టీసీ అధికారులు జగిత్యాల- ధర్మారం రూట్ విచారణ చేపట్టిన అనంతరం డిపో మేనేజర్ యధావిధిగా చర్లపల్లి పాత బస్ స్టాప్ లో తప్పకుండా బస్సులు ఆపాలని సంబంధిత డ్రైవర్, కండక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకంతో మహిళలు అధికంగా బస్సులలో ప్రయాణిస్తున్నారని, ఒకే గ్రామంలో రెండు, మూడు రిక్వెస్ట్ స్టేజ్ లు ఉండడంతో ఈ పరిస్థితి నెలకొందని ఆమె అన్నారు. అయితే ఈ విషయమై బస్సులు ఆపకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు ధర్నా నిరసనకు సిద్ధమైన ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా వేసుకోగా ప్రస్తుతం చేపట్టేందుకు సిద్ధమైన వేళ.. నేటి సాక్షి వార్త కథనం సామాజిక మాధ్యమాల ద్వారా సమస్యను తెలుసుకుని స్పందించి ఆర్టీసీ అధికారులు పరిష్కారం చూపడంతో శాంతించిన గ్రామస్తులు, ప్రయాణికులు ఆర్టీసీకి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వెలువడుతున్న నేటి సాక్షి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.





