నేటి సాక్షి కోటపల్లి పోలీస్ స్టేషన్లో ఘనంగా స్వచ్ఛత కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా కోటపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ మరియు కోటపల్లి ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అందరూ సమిష్టిగా నడుంబిగించి స్టేషన్ పరిసరాలను అందంగ్గా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా అధికారులు మరియు సిబ్బంది స్వయంగా శ్రమదానం చేస్తూ, స్టేషన్ లోపల మరియు వెలుపల ఉన్న చెత్తా ని తొలగించి పరిశుభ్రత పట్ల తమ నిబద్ధతను చాటారు.ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో అస్తవ్యస్తంగా పెరిగిన పిచ్చి మొక్కలను, ముళ్ల పొదలను తొలగించి ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. కేవలం పరిసరాలనే కాకుండా, స్టేషన్లోని రికార్డులను సైతం క్రమపద్ధతిలో , సర్దుతూ దుమ్ము లేకుండా శుభ్రపరిచారు. విధి నిర్వహణలో నిరంతరం బిజీగా ఉండే సిబ్బంది, సామాజిక బాధ్యతగా భావించి ఈ స్వచ్ఛత యజ్ఞంలో ఉత్సాహంగా పాల్గొనడం విశేషం.ఈ సందర్భంగా సీఐ కృష్ణ మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులకు మరియు ప్రజలకు ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. సమస్యలతో స్టేషన్కు వచ్చే వారు ఇక్కడి పరిసరాలను చూసి మానసిక ప్రశాంతత పొందేలా ఉండాలని, అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ స్వచ్ఛత దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పరిశుభ్రమైన వాతావరణం పని ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, ప్రజల్లో పోలీసుల పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.





