నేటి సాక్షి వికారాబాద్:వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలోని (డీపీవో) వివిధ విభాగాలను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలోని అడ్మినిస్ట్రేషన్, డీసీఆర్బీ (డి సి ఆర్ బి), స్పెషల్ బ్రాంచ్,సైబర్ క్రైమ్ తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేశారు. విధుల్లో ఉన్న సిబ్బందితో, అధికారులతో ముఖాముఖిగా మాట్లాడి వారి పనితీరును, బాధ్యతలను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయ ఆవరణను, భాద్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.అనంతరం ఎస్పీ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పని చేయాలని సూచించారు. ముఖ్యంగా వివిధ సెక్షన్ల పరిధిలో ఉన్న ఫైల్స్ ఏవీ పెండింగ్ లో ఉంచకూడదని, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు గాని, శాఖాపరమైన సమస్యలు గాని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. అనవసరమైన జాప్యం చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని. ప్రతి ఫైల్ పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు.అలాగే, జిల్లా పోలీస్ కార్యాలయంలోని అన్ని విభాగాల అధికారులు సిబ్బంది ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటూ పని చేయాలని ఎస్పీ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ పనులను వేగవంతం చేయాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని స్పష్టం చేశారు. విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.





