నేటి సాక్షి(పూరెళ్ల బాపు)………….పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు ఇప్పించేందుకు ప్రభుత్వంతో మాట్లాడి నా వంతు కృషి చేస్తానని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.రేవా జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం సభ్యులు జగిత్యాలలోని ఇందిరా భవన్ లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి నీ కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. పెన్షనర్ల సమస్యలు, ఇబ్బందులు తెలుసని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి పాటుపడుతానని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. 2024 మార్చి నుండి ఇప్పటివరకు ఉద్యోగ విరమణ చెందిన ఉద్యోగుల, ఉపాధ్యాయుల ప్రయోజనాలు వచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని రేవా జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఐల్నేని నరేందర్ రావు, ప్రధాన కార్యదర్శి ఎన్నం రాoరెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఐల్నేని నరేందర్ రావు,ఎన్నం రాంరెడ్డిలు మాట్లాడుతూ ఏడాదిన్నర కాలంగా ఉద్యోగ విరమణ చెందిన ఉద్యోగులకు రావలసిన జిపిఎఫ్, జిఐఎస్, లీవ్ ఎన్కాష్మెంట్, కమ్యూటేషన్, గ్రాట్యూటీ అందలేదన్నారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వెంటనే రావాల్సిన బకాయిలు అందక పెన్షనర్లు నానా ఇబ్బందులు పడుతున్నారని, గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. ఈ విషయమై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన పెడచెవినపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెన్షన్ బకాయిలు రాక ఇప్పటివరకు రాష్ట్రంలో 16 మంది పెన్షనర్లు చనిపోయారని, చాలామంది అనారోగ్యంతో హాస్పిటల్లో డబ్బులు కట్టలేని దీనావస్థలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే పెన్షన్లకు రావాల్సిన బకాయిలను ఏక మొత్తంగా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగ విరమణ బకాయిలు వచ్చేంతవరకు పోరాటం చేయాలని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి వెనుకాడబొమని హెచ్చరించారు. బకాయిలు రాక పిల్లలకు పెళ్లిళ్లు చేయలేక, ఇల్లు కట్టుకోలేక, అనారోగ్యంతో బాధపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి మామిడాల లక్ష్మీనారాయణ,రేవా నాయకులు జున్న దుబ్బయ్య,పైడిపల్లి సత్యనారాయణ రావు,మోర గోవర్ధన్,మదన్మోహన్రావు,దొడ్డ సత్యనారాయణ,బుర్ర గంగాధర్,ఎర్రోజుల చంద్రమౌళి,చంద్రయ్య,వివేక్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.




