నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)రిటైర్ అయిన రైల్వే, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్ రివిజన్ అనేది అత్యంత కీలకమైన అంశమని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తిరుపతి సిఆర్ఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తిరుపతి ఎంపీ గురుమూర్తికి మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా పెన్షనర్లను బాధిస్తున్న ముఖ్య సమస్యల గూర్చి ఆయనకి వివరిస్తూ, ముఖ్యంగా 2026 సంవత్సరానికి ముందు పదవీ విరమణ చేసిన వారిని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో చేర్చకపోవడంతో వస్తున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా చేయాలని ఎంపీని కోరారు. ఇక ఈ అంశంపై వెంటనే స్పందించిన తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కి లేఖ రాశారు. ఎంపీ లేఖలో పేర్కొన్న ముఖ్యాంశాలు పరిశీలిస్తే దేశ సేవ కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన సుమారు 69 లక్షల మంది పెన్షనర్లు ఇప్పుడు పెన్షన్ రివిజన్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పెరుగుతున్న జీవన వ్యయం, వైద్య ఖర్చుల దృష్ట్యా, పెన్షన్ రివిజన్ లేకపోవడం వీరికి తీవ్ర ఆర్థిక భారంగా మారిందని, వీరి నిజమైన హక్కైన పెన్షన్ రివిజన్ను 8వ వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో చేర్చడం అత్యవసరమని ఎంపీ తన లేఖలో కేంద్ర మంత్రిని కోరారు. వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్లకు గౌరవం, భద్రత, ఆర్థిక స్థిరత్వం కల్పించడం ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేశారు. పెన్షనర్లకు న్యాయం జరిగేలా ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి, అవసరమైన చర్యలు వేగంగా తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి కేంద్ర మంత్రిని అభ్యర్థించారు.





