నేటి సాక్షి,నారాయణపేట, మార్చు 16( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణ పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే పీఏ, కాంగ్రెస్ పార్టీ రెడ్డి దొరల ఆగడాలు శృతిమించిపోతున్నాయని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్ ఆరోపించారు.సోమవారం నారాయణ పేట పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధన్వాడ మండలం చీకర్ల గడ్డ తండాకు చెందిన ఎస్టీ గిరిజనులు గత 70 ఏండ్లుగా సర్వే నంబర్ 708లో 5-37 గుంటల భూమిని సాగు చేసుకుంటూ,పట్టా హక్కులు పొంది ఉన్నారని,ప్రస్తుతం రైతుల నుండి బలవంతంగా ఆ భూమిని లాక్కోవడానికి కొండాపూర్ గ్రామానికి చెందిన అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్ రెడ్డి,మాధవ రెడ్డి,మరికొంత మంది ఎమ్మెల్యే అనుచరులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.ధన్వాడ మండలంలో ఎమ్మెల్యే అనుచరులు,కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. న్యాయం కోసం బాధిత గిరిజన రైతులు ఎమ్మెల్యే బంగళాకు పోతే వాటాలు అడగడం అత్యంత దుర్మార్గమన్నారు. నారాయణ పేట నియోజకవర్గంలో ప్రజా పాలనా నడుస్తున్నదా? లేక రెడ్డిల పాలన నడుస్తున్నదా? అంటూ ప్రశ్నించారు.గిరిజన రైతుల భూముల జోలికొస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే కార్యాలయం ముందు బాధిత రైతుల కోసం ఆమరణదీక్ష కు సిద్ధమన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఎస్సీ ఎస్టీ కమీషన్,మానవ హక్కుల కమీషన్ కు పిర్యాదు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు అశోక్,అజయ్ కుమార్,వెంకటన్న ముదిరాజ్,శివ,బాధిత రైతులు సంజీవ్ నాయక్,బాలు నాయక్,పాండు నాయక్,గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.





