నల్లగొండ : జాతీయ గ్రీన్ కార్ప్స్ (ఎన్జిసి) సూచనల మేరకు ఎన్జి కళాశాలలో ఏకో క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం పేపర్ క్రాఫ్ట్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగాకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పర్యావరణంపై బాధ్యతాభావాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. ప్రకృతి సంపదలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వ్యర్థ పదార్థాలను ఉపయోగకరమైన వస్తువులుగా మార్చే కార్యక్రమంలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. అనంతరం ఏకో క్లబ్ కన్వీనర్ వి. శరీష మాట్లాడుతూ, పేపర్ క్రాఫ్ట్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. పాత వార్తాపత్రికలు, మ్యాగజీన్లు మరియు ఉపయోగించని కాగితాలను ఉపయోగించి, అందమైన అలంకరణ వస్తువులు, పూలు, గోడ అలంకరణలు తయారు చేయవచ్చని తెలిపారు. ఈ విధంగా పేపర్ క్రాఫ్ట్ ద్వారా“రెడ్యూస్ , రీయూజ్, రీసైకిల్ భావనను విద్యార్థులు ఆచరణలో పెట్టవచ్చని చెప్పారు. ఇది విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్జిసి ప్రాజెక్ట్ లీడర్ రాజశేఖర్, జిల్లా ఎన్జిసి కో-ఆర్డినేటర్ లక్ష్మీకాంత్ ప్రత్యేక అతిథులుగా పాల్గొని, విద్యార్థులను పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ పరంగి రవి, డా. శ్రీనివాసులు, డా. మునుస్వామి, డా. నాగరాజు, డా. శ్రీధర్, ఈకో క్లబ్ సభ్యులు కె. శివరాణి, డా.పి.సిద్ధేశ్ గౌడ్, డా.డి.కృష్ణ, ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.





