నేటి సాక్షి గజ్వేల్…..గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 19వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మున్నావర్ అలీ (మున్నా) ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెక్యులరిజానికి ప్రతీకగా నిలిచిన గజ్వేల్ పట్టణంలో అధికార దాహంతో బీజేపీ నేతలు మత రాజకీయాలకు తెరలేపుతున్నారని, టీఆర్ఎస్–బీజేపీ పార్టీల మధ్య ఎలాంటి తేడా లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. పేదవాడి కడుపు నింపాలనే లక్ష్యంతో రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నామని వివరించారు.ఇల్లు లేని నిరుపేదలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా పట్టణ పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన కొనసాగుతుందని, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సహకారంతో తన వార్డులో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 19వ వార్డు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని మున్నావర్ అలీ ప్రజలను కోరారు.





