నేటి సాక్షి, కరీంనగర్:ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి బుధవారం ఫిర్యాదు చేశారు. కరీంనగర్లో మంగళవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల సందర్భంగా విడుదలైన సమాచారంలో మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ఫోటోను, వారు పాల్గొనడాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదని, ఇటీవల జరిగిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో అధికారిక ఫోటోలు, సమాచారంలో పొందుపరచలేదని గుర్తు చేశారు. దళిత ప్రజాప్రతినిధిని విస్మరించడం, అధికార యంత్రాంగం ఉద్దేశపూర్వకంగా సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకొని ఇలా వ్యవహరిస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మామిడి అనిల్, జీడి రమేష్, సముద్రాల లక్ష్మణ్, జుంజుపల్లి వివేక్, గొట్టే బాబు, కనకం విద్యాసాగర్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.





